ఎవభై కాదు కదా…
డెబ్భయిలూ అరవైలూ చేరకముందే
నా చుట్టూ ఉన్న అన్నలు, తమ్ముళ్లు
నాన్నలు, అమ్మలు, అక్కలు…
కొడుకులు, కూతుళ్లు.. అలాంటి అనేక బిడ్డలు …
నా అనుకోగలిగిన వాళ్లలో
నిమిషాకి పదో వందో మందికిపైగా అసుపులు బాస్తున్న నా దేశంలో
ఎనభై అయిదేళ్ల ముదుసలి
నిత్య కాలకేశికా జటధారి.. చావబోతే నొల్లనివ్వని వారు కొల్లలు
మర శ్వాసలను లోపలికి నెడుతూ, బయటకు తీస్తూ
మరణ ఘడియలను నిమిషాలుగా, గంటలుగా వెనక్కి నెడుతూ
బతుకును భ్రమాలంకారంలో ముంచెత్తి.
నిర్విరామ నిరీక్షల పర్వాన్ని రక్తి కట్టించారు.
యముడ్ని బెదరగొట్టగల సావిత్రీసములు శతసహస్రాలుగా
పగళ్లూ రాత్రుళ్లూ వంతు బృందాలుగా, భజనలు హోరెత్తించారు
నా జాతి మొత్తం
కళ్లలో ఫోకస్ లైట్లు వెలిగించుకుని,
నోళ్లకు గన్ మైకుల్ని కట్టుకుని,
తలకో, అవతల బండికో శాటిలైట్ గొడుగును వెల్లకిలా బిగించుకుని
ఎదర కెమెరాలను కరచుకుని
బులెటిన్లు పారిత్తించారు
రోజువారీ తెల్లారగట్ల పలకరించే పత్ర రాజాల్ని
పుటలు పుటలుగా
రకరకాల ఊహా వ్యాఖ్యాన విన్యాసాలతో నింపేశారు.
మంది” సంవద మెండైన నా దేశంలో
మందగించిన మతి మోతాదు ఇంతుందా
అని
సకల వ్యాధిగ్రస్థమైన దేహాన్ని పార్థివంగా మార్చి, ఎంచి. విడిచి,
మెల్లగా జారుకున్న ఆత్మ సాక్షిగా.. బాధాతప్త చిరాకు కలిగింది.
— మునిసురేష్ పిళ్లె
మౌలికంగా జర్నలిస్టు. రచయిత. సుమారు ముప్ఫయ్యేళ్లుగా రాస్తున్నారు. తండ్రి ఎల్లయ్య స్థాపించిన ఆదర్శిని పత్రికతో రచనలు మొదలు పెట్టారు. రెండు కథా సంపుటులు ‘పూర్ణమూ.. నిరంతరమూ..’, ‘రాతి తయారీ’, ఒక నవల ‘సుపుత్రికా ప్రాప్తిరస్తు’ ప్రచురించారు.





Discussion about this post